Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *పాఠశాలకు వెళ్తుండగా మృత్యువు.. తల్లి కళ్లముందే ముగిసిన చిన్నారి జీవితం* సికింద్రాబాద్ | తిరుమలగిరి, జనవరి 21: సికింద్రాబాద్లోని తిరుమలగిరి ఆర్మీ పబ్లిక్ స్కూల్ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నగరాన్ని విషాదంలో ముంచింది. పాఠశాలకు వెళ్తున్న ఏడేళ్ల బాలుడు తల్లి కళ్లముందే మృత్యువును ఆలింగనం చేసుకోవడం హృదయాలను కలచివేసింది. ఆర్కేపురం వంతెన నుంచి తల్లి తన కుమారుడిని స్కూటీపై పాఠశాలకు తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై స్కూటీ అదుపుతప్పడంతో తల్లి–బాలుడు ఇద్దరూ కిందపడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆర్మీ వాహనం కిందపడ్డ బాలుడి పైనుంచి వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రమాద తీవ్రత స్పష్టంగా బయటపడింది. బాలుడిని కాపాడలేకపోయిన తల్లి పరిస్థితి అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ప్రమాదంలో తల్లికీ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్మీ వాహనం వేగం, రోడ్డు పరిస్థితులు, భద్రతా చర్యల్లో లోపాలపై విచారణ జరుపుతున్నారు. పాఠశాలల సమీపంలో వేగ నియంత్రణతో పాటు కఠిన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయాలన్న డిమాండ్ ఈ ఘటనతో మరింత బలపడుతోంది. ఒక్క క్షణం నిర్లక్ష్యం ఒక చిన్నారి ప్రాణాలను బలిగొనడమే కాకుండా, ఓ కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టేసింది.
Admin
Mana Mahati News